వివాదాలకు తెర.. ఐదేళ్ల తర్వాత బరోడా గూటికి దీపక్ హుడా
టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ తన సొంత జట్టు బరోడా తరఫున దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగనున్నాడు. గతంలో బరోడా క్రికెట్ అసోసియేషన్తో ఏర్పడిన విభేదాలకు ముగింపు పలుకుతూ హుడా తిరిగి తన పాత జట్టులోకి అడుగుపెట్టాడు.2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ సమయంలో దీపక్ హుడా, అప్పటి బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యా మధ్య వివాదం తలెత్తింది. ప్రాక్టీస్ సందర్భంగా కృనాల్ తనను దూషించాడని హుడా ఆరోపించాడు. ఆ తర్వాత జట్టు బయో-బబుల్ నుంచి బయటకు వచ్చాడు.
కోవిడ్ సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను బరోడా క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది. క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న కారణంతో హుడాపై చర్యలు తీసుకుంది. దీంతో అతడు బరోడాను వీడి రాజస్థాన్ జట్టుకు మారాడు.ఇప్పుడు ఐదేళ్ల తర్వాత పరిస్థితులు మారాయి. బరోడా క్రికెట్ అసోసియేషన్తో హుడాకు ఉన్న విభేదాలు తొలగిపోవడంతో అతడు తిరిగి తన సొంత జట్టులో చేరేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని బీసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్నేహల్ పారిఖ్ ధ్రువీకరించారు.
31 ఏళ్ల దీపక్ హుడా మళ్లీ బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడని పారిఖ్ తెలిపారు. బరోడా నుంచే హుడా ఒక అద్భుతమైన క్రికెటర్గా ఎదిగాడని, ఇప్పుడు అదే జట్టు కోసం తిరిగి ఆడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కృనాల్ పాండ్యా, దీపక్ హుడా మధ్య గతంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని వెల్లడించారు. తన రీఎంట్రీపై హుడా కూడా స్పందించాడు. బరోడా తరఫున తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.దేశవాళీ క్రికెట్లో దీపక్ హుడాకు మంచి రికార్డు ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలతో 4,267 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో 3,972 పరుగులు, లిస్ట్-ఎ క్రికెట్లో 3,340 పరుగులు సాధించాడు. బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగల హుడా.. భారత జట్టు తరఫున 10 వన్డేలు, 21 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఐదేళ్ల క్రితం చోటుచేసుకున్న వివాదాలకు ఫుల్స్టాప్ పడటంతో.. దీపక్ హుడా మళ్లీ బరోడా జెర్సీలో కనిపించనున్నాడు. ఇది అతడి దేశవాళీ కెరీర్లో కీలకమైన రీఎంట్రీగా మారనుంది.