స్మృతి మంధన రికార్డు శతకం
హాంగ్కాంగ్పై భారత్కు 137 పరుగుల భారీ విజయం
మిథాలీ రాజ్ ఆల్-టైమ్ రికార్డును అధిగమించిన భారత ఓపెనర్
దుబాయ్: మహిళల ఆసియా కప్ 2026 లీగ్ దశలో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులతో విరుచుకుపడింది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధన రికార్డు స్థాయి సెంచరీతో చెలరేగడంతో, హాంగ్కాంగ్పై భారత్ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధన కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులతో విద్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (17 బంతుల్లో 28)తో కలిసి తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మంధన, పవర్ప్లే తర్వాత మరింత వేగంగా పరుగులు సాధించింది. రిచా ఘోష్ (11), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (10) స్వల్ప వ్యవధిలోనే ఔటైనప్పటికీ మంధన ఇన్నింగ్స్ను ఒంటిచేత్తో నడిపించింది.
ఈ ఇన్నింగ్స్ ద్వారా స్మృతి మంధన మహిళల అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 10,880 పరుగులు పూర్తి చేసుకున్న మంధన, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10,868 పరుగులు) పేరిట ఉన్న ఆల్-టైమ్ రికార్డును అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా అగ్రస్థానానికి చేరింది.
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్కాంగ్, భారత బౌలర్ల క్రమశిక్షణతో కూడిన దాడికి తలవంచి 16.2 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్ దీప్తి శర్మ 3 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి, ప్రేమ రావత్, నందని శర్మ చెరో రెండు వికెట్లతో రాణించారు. హాంగ్కాంగ్ బ్యాటర్లలో నటాషా మైల్స్ (15) ఒక్కతే రెండంకెల స్కోరు సాధించింది.