భారీ వర్షాలకు కుంగిన పట్టాలు
హౌరా-మాల్దా డివిజన్లో రైళ్ల రాకపోకలకు ఆటంకం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని తూర్పు రైల్వే పరిధిలో ఉన్న హౌరా-మాల్దా డివిజన్లో భారీ వర్షాల కారణంగా రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో గురువారం పలు రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్థరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో టిల్పారా – న్యూ ఫరక్కా స్టేషన్ల మధ్య అప్ లైన్ పట్టాల కింద నేల మెత్తబడి మట్టి కోతకు గురైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం వల్ల ఉత్తర, దక్షిణ బెంగాల్ ప్రాంతాల మధ్య నడిచే ప్రధాన రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఉదయం నుంచి ఉత్తర బెంగాల్ వైపు వెళ్లే అప్ లైన్ రైళ్లను ప్రత్యామ్నాయ బైపాస్ లైన్ ద్వారా మళ్లించి నడుపుతున్నారు. న్యూ ఫరక్కా వైపు వచ్చే డౌన్ లైన్ రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ రైల్వే అధికారులు, ఇంజనీరింగ్ నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ట్రాక్ దెబ్బతినడంతో జోగ్బానీ ఎక్స్ప్రెస్, గౌర్ ఎక్స్ప్రెస్, డార్జిలింగ్ మెయిల్ వంటి పలు దూరప్రాంత ఎక్స్ప్రెస్ రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగానే నేల కుంగిపోయి మట్టి కొట్టుకుపోయిందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు త్వరలోనే మార్గాన్ని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.