బెంగళూరులో 'ఏరో ఇండియా 2027'
ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన
బెంగళూరు: ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక రక్షణ ఎగ్జిబిషన్లలో ಒಂದైన 'ఏరో ఇండియా' 16వ ఎడిషన్కు వేళైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన 2027 ఫిబ్రవరి 8 నుండి 12 వరకు బెంగళూరులోని యలహంక వైమానిక దళ స్థావరంలో జరగనుంది.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ ఉత్పత్తి విభాగం ఈ ఐదు రోజుల భారీ కార్యక్రమాన్ని నిర్వాహక బాధ్యతలు చేపట్టి నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు, పాలసీ మేకర్లు, సాంకేతిక నిపుణులు, స్టార్టప్లు మరియు రక్షణ రంగ ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచానికి చాటడంతో పాటు 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపుకు ఈ ఈవెంట్ మరింత వేగాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.ప్రదర్శనకారులు, సందర్శకుల కోసం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, స్టాళ్ల బుకింగ్స్ సెప్టెంబర్ 3, 2026 నుంచే ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. భారత వైమానిక దళంతో (IAF) పాటు పలు అంతర్జాతీయ విమాన బృందాలు సరికొత్త అధునాతన యుద్ధ విమానాలతో గగనతలంలో చేసే సాహస విన్యాసాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక మార్పిడిని ప్రోత్సహించడమే కాకుండా దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), డిఫెన్స్ స్టార్టప్లకు విస్తృత అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వేదిక ద్వారా ప్రపంచ రక్షణ సరఫరా వ్యవస్థలో నమ్మకమైన భాగస్వామిగా భారత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది.