జాతీయ భద్రతకు ఇంధన స్వయం సమృద్ధి అత్యంత కీలకం
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గుల నేపథ్యంలో భారతదేశానికి ఇంధన భద్రత అత్యంత కీలకమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, ఆర్థిక బలం నుండి ఇంధన రంగం విడదీయరానిదని ఆయన స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో 'పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' నిర్వహించిన "6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026 – భారతదేశ ఇంధన & ఆహార భద్రతా మిషన్" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, డేటా సెంటర్లు వేగంగా పెరుగుతున్నందున, ఆర్థిక వ్యవస్థ గరిష్ఠ ప్రయోజనాలు పొందడానికి చౌకైన, స్వచ్ఛమైన ఇంధనం అత్యవసరమని పేర్కొన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అణు రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం ద్వారా వనరులు పెరుగుతాయన్నారు.
2033 నాటికి ఐదు 'స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల'ను అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ రైలుతో సహా క్లీన్ ఎనర్జీ రం గానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం ప్రతీ పనిని స్వయంగా చేయలేదని, ప్రైవేట్ భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ R&D పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ. 1 లక్ష కోట్ల 'పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ' (RDI) నిధిని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
ఒకప్పుడు కేవలం 350గా ఉన్న భారత స్టార్టప్ల సంఖ్య నేడు 2.4 లక్షలకు చేరి, భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఆవిర్భవించిందని కొనియాడారు.
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రవాణా, నీటిపారుదల రంగాలు పెరిగిన ఇంధన అవసరాలను తట్టుకోవడానికి జీవ ఇంధనాలు, ఇథనాల్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
పరిశోధనలు, ఆవిష్కరణలలో 'అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' ద్వారా ప్రభుత్వేతర భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి పరిశ్రమలు వంతెనలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.