20 వేల ఇళ్ల పునర్నిర్మాణం తప్పనిసరి, కొనసాగుతున్న గాలింపు
ఖాట్మండు: హిమానీనదం (గ్లేసియర్) హఠాత్తుగా కూలిపోవడంతో విపత్తును ఎదుర్కొన్న నేపాల్లో పునరావాసం, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంచు, రాళ్లు, బురద వరదలా వచ్చి గ్రామాలను ముంచెత్తడంతో సుమారు 20,000 ఇళ్లను పునర్నిర్మించాల్సి ఉంటుందని అధికారులు గురువారం వెల్లడించారు. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,204 మంది మరణించగా, 4,200 మందికి పైగా గల్లంతయ్యారు.
వరద దాటికి ప్రాథమిక అంచనా ప్రకారం 7,500 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోగా, మిగిలినవి శిథిలాల కింద కూరుకుపోయాయి. నిలబడి ఉన్న ఇళ్లు కూడా నివాసయోగ్యంగా లేకపోవడంతో మొత్తం 20,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. ముప్పు ఉన్న ప్రాంతాల్లో మళ్లీ ఇళ్లు నిర్మించబోమని, ప్రజల భద్రత దృష్ట్యా ప్రత్యామ్నాయ సురక్షిత స్థలాలను అన్వేషిస్తున్నామని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ (NDRRMA) అధిపతి ధర్మ రాజ్ ఉప్రేతి తెలిపారు.
జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం భారత్, చైనా, దక్షిణ కొరియా నిపుణుల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొరియన్ కార్మికులు గల్లంతైన అప్పర్ త్రిశూలి-1 వద్ద థర్మల్ ఇమేజింగ్, డ్రోన్లు, రెస్క్యూ డాగ్స్తో గాలిస్తున్నారు.
ప్రజలు ఇళ్లతో పాటు పౌరసత్వ కార్డులు, పాస్పోర్టులు, సర్వస్వం కోల్పోయారు. సుమారు 22,000 మంది పిల్లలకు అత్యవసరంగా సురక్షిత నీరు, ఆహారం అవసరమని యునిసెఫ్ తెలిపింది. పిల్లల విద్యకు విఘాతం కలగకుండా తాత్కాలిక కేంద్రాలలో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను గుర్తించేందుకు చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాటిలైట్ లింక్, కెమెరాలు, భూకంప సెన్సార్లతో కూడిన హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజలకు పునరావాసం కల్పిస్తూనే, ప్రాణాలతో ఉన్నవారిని కాపాడటానికి గాలింపు చర్యలను కొనసాగిస్తామని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు.