|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 09:28 PM
తెలంగాణ నుంచి ఒక మహిళా ఎంపీ మూడు దశాబ్దాల తర్వాత ఒకేసారి రెండు కీలకమైన ప్రైవేట్ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టడం ఒక విశేష పరిణామంగా నిలిచింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మహిళల ఆరోగ్యం, సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా ఈ చారిత్రక అడుగు వేశారు. ఈ రెండు బిల్లులను లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
1. నెలసరి ప్రయోజన బిల్లు 2024 .. 4 రోజులు పెయిడ్ లీవ్స్ డిమాండ్..
డాక్టర్ కడియం కావ్య ప్రవేశపెట్టిన బిల్లులలో నెలసరి ప్రయోజన బిల్లు 2024 అత్యంత కీలకమైనది. ఉద్యోగినులకు నెలసరి సమయంలో 4 రోజులు వేతనంతో కూడిన సెలవులు తప్పనిసరి చేయాలని ఈ బిల్లు కోరుతోంది. పనిచేసే ప్రదేశాలలో మహిళలకు అవసరమైన సౌకర్యాలు, అందుబాటు గదులు, శుభ్రమైన రెస్ట్రూములు, తగిన ఆరోగ్య వసతులు కల్పించాలని చట్టపరమైన నిబంధనలను ప్రతిపాదించారు. మహిళల ఆరోగ్యం, ఉద్యోగ ఉత్పాదకత , భద్రత దృష్ట్యా ఈ చర్య అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు. మహిళల హక్కులను ఉల్లంఘించే కంపెనీలకు భారీగా జరిమానాలు విధించాలని బిల్లులో పేర్కొన్నారు.
ఇప్పటికే కర్ణాటక, బిహార్, ఒడిషా వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా సెలవులను అమలు చేస్తుండగా, ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్కు బలం చేకూరుతుంది.
2. ఒంటరి మహిళల సామాజిక భద్రతా బిల్లు..
డాక్టర్ కడియం కావ్య ప్రవేశపెట్టిన రెండో బిల్లు ఒంటరి మహిళల సామాజిక భద్రతపై దృష్టి సారించింది. ఒంటరి మహిళలు, వితంతువులు, ఆపన్నస్థితిలో ఉన్న స్త్రీలకు ప్రభుత్వం ద్వారా తక్షణమే అత్యవసర సహాయం అందించాలని ఈ బిల్లు కోరుతోంది. వారికి ఆధార వేతనాలు.. గృహ భద్రత, ఇతర ముఖ్యమైన సామాజిక సంక్షేమ చర్యలు తక్షణమే అందేలా ఒక ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ఈ రెండు బిల్లుల ఆమోదం మహిళా సాధికారత దిశగా ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా మహిళా సంక్షేమానికి మార్గదర్శకంగా ఉంటుందని మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.