|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 07:53 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో బీజేపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఆమోదించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజీనామా తర్వాత రాజాసింగ్ నేడు అనగా మంగళవారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికి కూడా బీజేపీ ఎమ్మెల్యేనే అని.. గోషామహల్కి మూడేళ్ల పాటు ఎన్నికలు రావని.. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని.. ఎమ్మెల్యే పదవికి కాదని స్పష్టం చేశారు. బీజేపీ తనకు సొంతిల్లు వంటిదని.. రాజాసింగ్ రా అంటే.. వెంటనే తాను తిరిగి బీజేపీలోకి వెళ్లిపోతానని రాజా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
తాను కొన్ని తప్పులు చేశానని.. అలానే సోషల్ మీడియా వేదికగా తన గురించి మరి కొంత తప్పుడు ప్రచారం జరిగిందని రాజాసింగ్ తెలిపారు. రాజాసింగ్ మీడియాకు లీకులు ఇస్తున్నారని తన పార్టీ వారే కొందరు ఢిల్లీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. పార్టీలో తనకు శత్రువులు, మిత్రలు ఇద్దరూ ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీ హైకమాండ్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. అలానే తాను ఏ పార్టీలో ఉండలేనని.. ఏ పార్టీకి తాను మ్యాచ్ కానని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ..‘ఇప్పటికీ కూడా నన్ను బీజేపీ ఎమ్మెల్యే అనే చెప్పవచ్చు. కొంత నా తప్పు.. మరి కొంత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. మా వాళ్లే నేను మీడియాకు లీకులు ఇస్తున్నాని ఢిల్లీకి ఫిర్యాదు చేశారు. పెన్డ్రైవ్లో నా మీద ఫిర్యాదులు పైకి పంపారు. వీటివల్లే బీజేపీ పెద్దలు నా రాజీనామాను ఆమోదించారు. గోషామహల్లో ఉప ఎన్నిక రాదు. ఎందుకంటే నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను.. ఎమ్మెల్యే పదవికి కాదు. కానీ కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందనే భ్రమలో ఐరన్ బట్టల్లో తిరుగుతున్నారు.వీళ్లతో పాటుగా కొందరు మా పార్టీ నేతలు కూడా తిరుగుతున్నారు. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే గోషామహల్కి మరో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేను’ అని చెప్పుకొచ్చారు.
‘మా పార్టీ పెద్దలు పిలిస్తే నేను ఢిల్లీ వెళ్లి వారితో మాట్లాడతాను. అన్ని విషయాలు హైకమాండ్కు తెలియజేస్తాను. మా పార్టీ వారే చాలా మంది ఎందుకు బయటకు వెళ్లారు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు ఎందుకు అవమానాలు భరిస్తున్నారు అన్ని వివరిస్తాను. ఇవాళ కాకపోతే రేపయినా నన్ను పిలుస్తారని భావిస్తున్నాను’ అని రాజాసింగ్ తెలిపారు.
‘ప్రస్తుతం నేను బీజేపీ హై కమాండ్ను కలిసే ప్రయత్నాల్లో ఉన్నాను. అధిష్టానం నన్ను పిలుస్తుందనే నమ్మకం ఉంది. నేను వేరే పార్టీలో ఉండలేను, ఆ పార్టీలకి నేను మ్యాచ్ కాను. బీజేపీ నా ఇల్లు, రాజాసింగ్ రా అంటే వెంటనే బీజేపీలోకి వెళ్లిపోతాను. నా వెనుక ఎవరు లేరు. గతంలో నన్ను 14 నెలలు పార్టీ నుంచి బహిష్కరించారు. ధర్మ ప్రచారం, నియోజకవర్గం ప్రజల అభివృద్ధి.. ప్రస్తుతం ఈ రెండే నా ముందున్న అంశాలు. నా లాంటి వాళ్ళు వస్తారు పోతారు, కానీ బీజేపీ ఉండాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.