|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 08:32 PM
దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని చాకచక్యంగా కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది తిరుపతి యాదవ్, సంతోష్ చారి, మహ్మద్ ఇమ్రాన్లను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు అభినందించారు. ఈ నెల 25న రామిరెడ్డి అనే యువకుడు తీగల వంతెన అంచున నిలబడి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. అక్కడ విధుల్లో ఉన్న డీఆర్ ఎఫ్ సిబ్బంది కాపాడిన విషయం అందరికీ విధితమే. రామిరెడ్డిని మాటల్లో పెట్టి.., దృష్టి మరల్చి.. క్షణాల్లో కాపాడిన తిరుపతి యాదవ్ను కమిషనర్ అభినందించారు. అలాగే అక్కడ విధుల్లో ఉండి.. యువకుడిని కాపాడేందుకు సహకరించిన సంతోష్ చారి, మహ్మద్ ఇమ్రాన్లను కూడా శాలువ కప్పి సన్మానించారు. దుర్గం చెరువు వంతెనపై నీరు నిలబడకుండా.. రంద్రాలను శుభ్రం చేస్తున్నప్పుడు ఓ యువకుడు దూకేందుకు యత్నిస్తున్న దృశ్యాలను చూశామని.. ఒకవైపు అతడిని దూకవద్దు అని మాటల్లో పెట్టి... మరో వైపునుంచి వచ్చి కాపాడినట్టు ఆ ముగ్గురు డీఆర్ ఎఫ్ ఉద్యోగులు కమిషనర్కు వివరించారు.