UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్
UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్ కంటే బలమైన అర్హత ఏ దేశానికీ లేదు: ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్
న్యూఢిల్లీ:
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో ఆరో శాశ్వత సభ్యదేశంగా చేరేందుకు భారత్ కంటే బలమైన అర్హత కలిగిన దేశం మరొకటి లేదని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్ స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయంలో చైనా కూడా మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్కు ఉన్న అపారమైన జనాభా, వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న అంతర్జాతీయ పరపతి మరియు ప్రపంచ వేదికపై అది పోషిస్తున్న దౌత్య పాత్ర.. UNSC శాశ్వత సభ్యత్వానికి భారత్ చేస్తున్న వాదనను మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ వేదికలపై వర్ధమాన దేశాలకు ప్రాధాన్యత పెంచాలని ఇటీవల 'బ్రిక్స్' కూటమి గట్టిగా గళమెత్తిన నేపథ్యంలో జెఫ్రీ సాచ్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, ప్రస్తుతం భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉన్నాయి. ఇందులో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యదేశాలుగా ఉండగా.. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల కాలపరిమితితో యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది.