ఇనుమడించిన దేశ ఖ్యాతి
న్యూఢిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు దౌత్యపరంగా బిజీబిజీగా గడిపారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు 15 అధికారిక ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రపంచ దేశాధినేతలతో భేటీ అయ్యారు. వీటికి అదనంగా పలువురు నేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో అనధికారిక ‘పుల్-అసైడ్’ చర్చలు కూడా నిర్వహించారు.
మొదటి రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్తో మోదీ భేటీ అయ్యారు. పుతిన్తో రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు.
రెండో రోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మోదీ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలను మరింత స్థిరీకరించడం, ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరిగాయి. ఇదే రోజున ఇథియోపియా, మలేసియా, అబుదాబి క్రౌన్ ప్రిన్స్, వియత్నాం నేతలతోనూ మోదీ సమావేశమయ్యారు.
మూడో రోజు కజకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి, నైజీరియా, ఉగాండా నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
ఈ భేటీల్లో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, సాంకేతికత, కీలక ఖనిజాలు, ప్రాంతీయ భద్రత, గ్లోబల్ సౌత్ ప్రయోజనాలు, బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఐరాస ప్రధాన కార్యదర్శితో సమావేశంలో ఐరాస భద్రతామండలి సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణల అవసరాన్ని మోదీ ప్రస్తావించారు.
ఇలా బ్రిక్స్ సదస్సును కేవలం బహుపాక్షిక వేదికగా కాకుండా.. భారత్ వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా కూడా మోదీ ప్రభుత్వం వినియోగించింది. మూడు రోజుల్లో 15 భేటీలతో భారత్ దౌత్య ప్రాధాన్యతను ప్రపంచ వేదికపై చాటినట్లయింది.