ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు
ధర్మవరం:
ధర్మవరం పట్టణంలోని కేశవనగర్లో వినాయక చవితిని పురస్కరించుకొని బీజేపీ నాయకులు ఎర్రజోడు లోకేశ్, ఎర్రజోడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 1,116 కిలోల గంధంతో భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ ప్రతిమ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో భక్తులు విశేషంగా తరలివచ్చారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గంధం వినాయకుడికి, లక్ష్మీ-సరస్వతీ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఎర్రజోడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక హోమం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది ఇలా వినూత్నంగా గంధంతో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం ఆనవాయితీగా వస్తోందని, స్వామివారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.