పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
పీజీ సీటు లభించలేదనే మనోవేదనతో ఓ ఎంబీబీఎస్ వైద్యుడు మృతి చెందిన విషాద ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. పసుల గౌతమ్ (39) ఎంబీబీఎస్ పూర్తి చేసి గత నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ధర్మారం మండలం నందిమేడారం, చొప్పదండి మండలం కటికనపల్లి గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుడిగా విధులు నిర్వహించారు. సుమారు నెల రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటివద్ద ఉంటున్నారు.గౌతమ్ గతంలో రెండుసార్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసినప్పటికీ మెరిట్ మార్కులు రాకపోవడంతో సీటు లభించలేదు. దీంతో కొంతకాలంగా ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సోమవారం రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం తన గదిలోకి వెళ్లిన గౌతమ్ ఉదయం కుటుంబ సభ్యులకు మృతి చెందిన స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గౌతమ్ తండ్రి పసుల రాజమొగిలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కుమారుడి మరణంపై ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతుడి తండ్రి ఇరిగేషన్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. గౌతమ్ అన్న బ్యాంక్ మేనేజర్గా, చెల్లెలు జగిత్యాలలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబం న్యూ సరస్వతి నగర్, తిగలగుట్టపల్లి ప్రాంతంలో నివసిస్తోంది.ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు.