యాంకీ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
గొంతు కోసి వడ్డే బుజ్జప్ప హతం.. గ్రామంలో కలకలం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ చంద్రశేఖర్రెడ్డి
దౌల్తాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 14): దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకీ గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన వడ్డే బుజ్జప్ప (48)ను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
బుజ్జప్పపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొడంగల్ సీఐ చంద్రశేఖర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు బుజ్జప్ప యాంకీ గ్రామంలోనే నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా, వారు హైదరాబాద్లో చదువుకుంటున్నట్లు సమాచారం. భార్య కూడా హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.