భారత్-మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందం విస్తరణ
న్యూఢిల్లీ: దక్షిణ అమెరికా వాణిజ్య కూటమి 'మెర్కోసూర్'తో ఉన్న ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాన్ని (PTA) మరింత విస్తరించేందుకు భారత్ చర్చలు ప్రారంభించింది. ఇరుపక్షాల మధ్య ఆర్థిక సంబంధాలను బలపరచడం, వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్ ఈ చర్చల ప్రారంభాన్ని సంయుక్తంగా ప్రకటించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందంలో పరస్పర ఆసక్తి ఉన్న మరిన్ని అదనపు రంగాలను చేర్చేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇందుకోసం సంబంధిత విధివిధానాలను (ToR) ఖరారు చేస్తున్నట్లు వెల్లడించాయి. అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే, బొలీవియాలతో కూడిన మెర్కోసూర్ కూటమితో వాణిజ్యం పెరగడం వల్ల లాటిన్ అమెరికా మార్కెట్లలో భారతీయ వ్యాపారాలకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి.