అనంతపురంలో చిరుతల బీభత్సం: టమాటా తోటలో 7 జింకల మృతి!
అనంతపురం జిల్లా తాటిచర్లలో చిరుతల దాడిలో ఏడు జింకలు మృతి చెందాయి. పొలం చుట్టూ ఉన్న కంచె కారణంగా జింకలు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోగా, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
అనంతపురం రూరల్ మండలం తాటిచర్ల గ్రామంలో చిరుతపులుల దాడి కలకలం రేపింది. స్థానిక రైతు నరసింహారెడ్డి తన టమాటా తోట చుట్టూ వన్యమృగాల రక్షణ కోసం కంచె ఏర్పాటు చేశారు. సమీప అడవి నుంచి పంట మేసేందుకు వచ్చిన ఏడు జింకల మందను వెంబడిస్తూ రెండు చిరుతలు తోటలోకి ప్రవేశించాయి.
ప్రాణభయంతో తప్పించుకునేందుకు యత్నించిన జింకలు, పంట కంచె అడ్డుగా ఉండటంతో బయటకు వెళ్లలేకపోయాయి. దీంతో చిరుతలు దాడి చేసి ఏడు జింకలనూ హతమార్చాయి. ఉదయం తోటకు వచ్చిన రైతు జింకల కళేబరాలను గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. గ్రామ పరిసరాల్లో చిరుతల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని, వెంటనే వాటిని బంధించాలని తాటిచర్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.