నేపాల్కు విద్యుత్ ఎగుమతికి భారత ప్రభుత్వం ఆమోదం
న్యూఢిల్లీ: ఇటీవల సంభవించిన తీవ్ర వరదల కారణంగా జలవిద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిని విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న నేపాల్కు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశ అదనపు విద్యుత్ అవసరాలను తీర్చడానికి రోజుకు 18 గంటల పాటు విద్యుత్ను ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 13 నుండి డిసెంబర్ 31, 2026 వరకు ప్రతిరోజూ 00:00 గంటల నుండి 18:00 గంటల మధ్య నేపాల్ విద్యుత్ అథారిటీకి భారత్ సరఫరా చేయనుంది. ముజఫర్పూర్–ధల్కేబార్ 400 kV డబుల్-సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, అలాగే తానక్పూర్–మహేంద్రనగర్ 132 kV సింగిల్-సర్క్యూట్ లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు విద్యుత్ను అందించనున్నారు.
వరదల వల్ల స్వదేశీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పడిపోయిన నేపాల్కు ఈ నిర్ణయం ఎంతో ఊరట నివ్వనుంది. జనవరి 2027 నుండి ఎగుమతి చేయాల్సిన విద్యుత్ పరిమాణాన్ని డిసెంబర్ 2026లో పునఃసమీక్షిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చర్య భారత్, నేపాల్ మధ్య దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని మరియు సరిహద్దు విద్యుత్ వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.