దంపతుల అనుమానాస్పద మృతి
సూర్య సెంటినరీ కాలనీ :
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వకీల్పల్లిలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్కు చెందిన దినసరి అజయ్ (26), దినేశ్వరి (24) దంపతులు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం కడుపునొప్పిగా ఉందని అజయ్ మేస్త్రీకి ఫోన్ చేయడంతో వారిని కమాన్పూర్కు, అక్కడి నుంచి గోదావరిఖనిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. అయితే దంపతుల మృతికి గల కారణాలు ప్రస్తుతం స్పష్టంగా తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.