రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం
ముంబై:రాబోయే సంవత్సరాల్లో రత్నాలు, ఆభరణాల రంగానికి భారతదేశం ప్రపంచ కేంద్రంగా ఆవిర్భవించనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో జరిగిన 52వ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ అవార్డ్స్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, ఉపాధి కల్పనలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని, దేశంలో ల్యాబ్-గ్రోన్ డైమండ్ (కృత్రిమ వజ్రాల) మార్కెట్ విస్తరిస్తున్న తరుణంలో ఈ విలువ గొలుసులో పరిశ్రమ ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
సూరత్, ముంబై నగరాలు ఈ రంగానికి కీలక నమూనాలుగా నిలిచాయని పేర్కొంటూ, ప్రపంచంలో కత్తిరించి, పాలిష్ చేసే ప్రతి పది వజ్రాలలో తొమ్మిది సూరత్లోనే ప్రాసెస్ అవుతున్నాయని గుర్తుచేశారు. ఈ పరిశ్రమ 2025 నాటికి ₹2.44 లక్షల కోట్లకు చేరుకుందని, వాణిజ్య ఎగుమతుల్లో 6.3 శాతం వాటాతో 75 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని తెలిపారు. ఇండియా జ్యువెలరీ పార్క్, SEEPZలో మెగా కామన్ ఫెసిలిటీ సెంటర్ వంటి ప్రాజెక్టులు, వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTA) రత్నాలు-ఆభరణాల రంగానికి సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని అమిత్ షా వివరించారు.