నాగర్కర్నూల్లో హత్య కేసు ఛేదన
భార్య, ప్రియుడు అరెస్ట్
నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ పట్టణంలోని రామ్నగర్ కాలనీకి చెందిన మహ్మద్ కరీం (43) దారుణ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. భార్యతో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్షతోనే ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలింది. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... మృతుడి భార్య సలీమా బేగం, గౌస్ పాషాల మధ్య గత రెండేళ్లుగా అక్రమ సంబంధం నడుస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో పాటు, రెండు నెలల క్రితం పెద్దల సమక్షంలో గౌస్ పాషాను మందలించారు. దాంతో కరీంను అడ్డు తొలగించుకుంటానని గౌస్ పాషా బెదిరించాడు.
ఆస్తి సలీమా పేరిట ఉండటంతో కరీంను హత్య చేసేందుకు వాట్సప్ కాల్స్ ద్వారా ఇద్దరూ కుట్ర పన్నారు. ప్లాన్ ప్రకారం సలీమా నెల్లూరు దర్గాకు వెళ్లిన సమయంలో, గౌస్ పాషా అర్థరాత్రి కరీం ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు. నిద్రమత్తులో తలుపు తీసిన కరీంపై కత్తితో దాడి చేసి, గొంతు కోసి ఘోరంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలు దొరక్కుండా కత్తి, దుస్తులు పడేసి పరారయ్యాడు. అనుమానంతో సలీమాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో గౌస్ పాషాను అరెస్ట్ చేయగా, నేరాన్ని అంగీకరించాడు. ఏ-1 గౌస్ పాషా, ఏ-2 సలీమా బేగంలను రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.