ఆఫ్రికన్ యూనియన్ ఛైర్పర్సన్తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ:18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్, బురుండి అధ్యక్షుడు ఎవరిస్ట్ నదయిషిమియెతో ఆదివారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2023లో భారత్ జీ20 అధ్యక్షత వహించిన సమయంలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం దక్కడంలో భారత్ వహించిన పాత్రను ఈ సందర్భంగా ఇరు నేతలు గుర్తు చేసుకున్నారు. అలాగే, త్వరలోనే 4వ భారత్-ఆఫ్రికా ఫోరం సదస్సు (IAFS-IV)ను నిర్వహించడంపై చర్చలు జరిపారు.
ఎబోలా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆఫ్రికన్ యూనియన్ చూపిస్తున్న నాయకత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించగా, ఆఫ్రికా సీడీసీ (CDC)కి భారత్ అందించిన వైద్య సహాయానికి ఏయూ ఛైర్పర్సన్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారత్-బురుండి ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించిన నేతలు, ఆర్థిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, వ్యవసాయ ఆధునీకరణ, ఆరోగ్య సంరక్షణ మరియు సామర్థ్య నిర్మాణం వంటి రంగాలలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.