ఆర్య వైశ్యులకు అండగా ప్రజా ప్రభుత్వం
హైదరాబాద్, సూర్య ప్రతినిధి : పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సౌమ్యులు, మానవతావాదులుగా పేదల విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్యవైశ్యులు సమాజంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, పలువురు శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఈ ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడేలా చూడాలని ప్రతినిధులకు సూచించారు. సాధారణ ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టిన మహాత్మా గాంధీ భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదగడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు కనిపిస్తాయని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య అందించిన విశేషమైన సేవను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సరుకులు అరువుగా ఇచ్చే విషయంలో మానవతతో వ్యవహరించే ఆర్యవైశ్యులు విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ముందు చూపుతో వ్యవహరించడం, జాగ్రత్తగా ఉండటం ఆర్యవైశ్యుల డీఎన్ఏలోనే ఉందన్నారు.
ఆర్యవైశ్యులంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తేనే బలం చేకూరుతుందని, తద్వారా రాజకీయాల్లో తమ వాటాను తామే సాధించుకోగలరని ముఖ్యమంత్రి సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు.