పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు
భూములు ఇస్తామని ఎప్పుడు చెప్పామో నిరూపించాలి
నిండు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటు
ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం
దోమ, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13):వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామానికి చెందిన రైతులు పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమ మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మూడు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.తాము భూములు ఇస్తామని ఎక్కడ, ఎప్పుడు చెప్పామో ఎమ్మెల్యే నిరూపించాలని రైతులు సవాల్ చేశారు. నిండు అసెంబ్లీలో తమ భూముల విషయంలో వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తమ జీవనాధారం వ్యవసాయ భూములేనని, ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇచ్చేందుకు తాము అంగీకరించలేదని స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పారు. అవసరమైతే ప్రాణాలు పోయినా సరే భూములను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా తమ భూముల విషయంలో అసత్య ప్రచారాలు మానుకుని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని రైతులు డిమాండ్ చేశారు.