డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి రైతుల ఆవేదన..
డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక
రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం
అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి
రైతుల ఆవేదన..
వల్లూరు మేజర్ న్యూస్
పంట చేతికి రావాలంటే ఎరువులు ఎంతో కీలకం. నాణ్యమైన ఎరువులతో మంచి దిగుబడి సాధించాలనే ఆశతో రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే తాము కొనుగోలు చేసిన డీఏపీ సంచుల్లో రాళ్లు, మట్టి, ఇసుక వంటి పదార్థాలు కనిపించాయని నలిపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి నిజానిజాలను తేల్చాలని కోరుతున్నారు. వల్లూరు మండల పరిధిలోని నలిపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆలంకాన్పల్లిలోని ఓ ఎరువుల దుకాణంలో డీఏపీ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆదివారం పొలంలో ఎరువులు వేసేందుకు సంచులను తెరవగా అందులో చిన్నచిన్న రాళ్లు, మట్టి, ఇసుక వంటి పదార్థాలు కనిపించాయని రైతులు పేర్కొన్నారు. రైతులు చూపించిన డీఏపీ సంచిపై భారతీయ జన్ ఊర్వరక్ పరియోజన భారత్ డీఏపీ 18-46-0, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే వివరాలు ముద్రించి ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎరువు నాణ్యతపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు యర్రమాచు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతు పంట పండించాలంటే ముందుగా పెట్టుబడి పెట్టాలి. విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు ఇలా ప్రతి దశలో రైతు డబ్బు ఖర్చు చేస్తున్నాడు. అధికారులు, ప్రభుత్వలు చెప్పిన మాటను నమ్మి ఎరువులు కొనుగోలు చేసి పొలంలో వేస్తున్నాం. ప్రతి ఎరువు సంచిని తెరిచి అందులో ఏముందో పరిశీలించుకుని వేయడం రైతుకు సాధ్యం కాదు. నమ్మకంతో సంచి తెరిచి పొలంలో వేస్తాం. మేము కొనుగోలు చేసిన డీఏపీ సంచిని తెరిచి చూడగా అందులో చిన్నచిన్న రాళ్లు, ఇసుక వంటి పదార్థాలు కనిపించాయి. ఇది చూసి మేము తీవ్రంగా ఆందోళనకు గురయ్యాం. ఎరువులో ఇలా ఎందుకు ఉంది దీని వల్ల పంటకు ఏమైనా నష్టం జరుగుతుందా రైతు పెట్టుబడి పరిస్థితి ఏమిటి అనే భయం కలుగుతోంది. రైతే రాజు అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ రైతు ఎంతో నమ్మకంతో కొనుగోలు చేసే ఎరువుల విషయంలో ఇలాంటి అనుమానాలు రావడం బాధాకరం. మా ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాలి. ఈ డీఏపీని సంబంధిత అధికారులు పరిశీలించి, నమూనాలను ప్రయోగశాలకు పంపించి నాణ్యతను పరీక్షించాలి. అసలు విషయం ఏమిటో రైతులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. తప్పు ఎవరిదైనా రైతు నష్టపోకూడదు. రైతు డబ్బు, రైతు శ్రమ, రైతు పంటను అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. మా ఫిర్యాదును చిన్న విషయంగా తీసుకోకుండా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో మరే రైతుకూ ఇలాంటి పరిస్థితి రాకుండా ఎరువుల నాణ్యతపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆరోపణల నేపథ్యంలో సంబంధిత వ్యవసాయ, ఎరువుల శాఖ అధికారులు డీఏపీ నమూనాలను పరిశీలించి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. ఎరువు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది శాస్త్రీయంగా నిర్ధారించాలని, లోపం ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల ఆరోపణలు నిజమా. డీఏపీలో కనిపించిన రాళ్ల, ఇసుక వంటి పదార్థాలు ఎలా వచ్చాయి. ఎరువు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అనే అంశాలపై అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. రైతు నమ్మకాన్ని కాపాడటమే అధికారుల బాధ్యత అని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు పుత్తా చంద్రశేఖర్ రెడ్డి. శ్రీనివాసులు రెడ్డి. సుబ్బారెడ్డి. పీటర్. చలపతి రెడ్డి. పెంచల్. సురేంద్ర నాయుడు. వెంకటసుబ్బారెడ్డి. సత్యనారాయణ రెడ్డి. శివారెడ్డిలు కోరుతున్నారు..