కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుపరాడితో దాడి
హరియాణాలోని గురుగ్రామ్లో ఘటన
ఇనుప రాడ్తో కొట్టడంతో తల, చేతికి తీవ్ర గాయాలు
దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్
పోలీసులు, ఆసుపత్రి సిబ్బందిపైనా బాధితుడి ఆరోపణలు
పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఓ కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడికి దారితీసింది. పార్కింగ్ అటెండెంట్ ఇనుప రాడ్తో దాడి చేయడంతో భారత వైమానిక దళ మాజీ అధికారి, 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో పాల్గొన్న గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తా (రిటైర్డ్) తీవ్రంగా గాయపడ్డారు. హరియాణాలోని గురుగ్రామ్లో జరిగిందీ ఘటన.
గుప్తా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గురువారం రాత్రి ఆయన తన కుటుంబంతో కలిసి డిన్నర్ కోసం మాగ్నమ్ గ్లోబల్ పార్క్లోని గొంజో రెస్టారెంట్కు వెళ్లారు. కారు పార్క్ చేసేందుకు ప్రయత్నించగా, అక్కడి సిబ్బంది ఒకచోట నుంచి మరోచోటకు పంపుతూ ఇబ్బంది పెట్టారని, చివరకు పార్కింగ్కు నిరాకరించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో కారును రివర్స్ చేస్తుండగా ఒక అటెండెంట్ కారు విండ్షీల్డ్పై కొట్టాడు. దీనిపై ప్రశ్నించేందుకు వాహనం దిగిన తనపై ఆ అటెండెంట్ ఇనుప రాడ్తో తల, చేతిపై బలంగా కొట్టాడని, చంపేస్తానని బెదిరించాడని గుప్తా వివరించారు.
తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్నా అక్కడి సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది ఎవరూ వెంటనే స్పందించలేదని గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ హెల్ప్లైన్కు కాల్ చేసినా, దాదాపు 30 నిమిషాల వరకు ఎవరూ రాలేదని తెలిపారు. చివరకు రెస్టారెంట్లోని ఓ చెఫ్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగిందని, అనంతరం అంబులెన్స్లో తనను మేదాంత ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఈ దాడిలో తన తలకి, మోచేతికి తీవ్ర గాయాలయ్యాయని, సర్జరీ చేసి మోచేతికి ప్లేట్లు అమర్చారని గుప్తా వెల్లడించారు.
ఆసుపత్రి తన మెడికో-లీగల్ రిపోర్టులో గాయాలను సరిగా నమోదు చేయలేదని కూడా ఆయన ఆరోపించారు. నిందితుడిపై హత్యాయత్నం, తీవ్రంగా గాయపరిచినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 1999లో కార్గిల్ సెక్టార్లో పాక్ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు భారత వైమానిక దళం చేపట్టిన మిషన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'.