నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు….
సూర్య నాగిరెడ్డిపేట్ :
పార్వతీ పారమేశ్వరుల ప్రాణ పుత్రుడు. గణనాథుడు నేడు కొలువుదీరనున్నాడు. ఉండ్రలయ్యాకు దండాలుపెడుతూ నిత్య పూజలు అందించేందుకు భక్తులు సమాయత్తమయ్యారు. విఘ్నాలు తొలగించు వినాయక.. అంటూ మండపాల్లో వెలసిన దేవదేవుడికి విన్నవించే రోజు నేటి నుండి ప్రారంభం కానున్నది. ఏ కార్యం తలపెట్టినా ఆది పూజలు అందేది వినాయకుడికే. ఏ వ్రతం చేపట్టినా గణపతి స్తోత్రంతోనే పూజలు ప్రారంభించడం అనవాయితీ. సోమవారం మండపాల్లో కొలువుదీరనున్న వినాయకుడి కోసం మండలంలోని అన్ని గ్రామాలలో మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో, ఇతర అలంకరణలతో నిర్వాహకులు సిద్ధం చేసుకున్నారు. మరికొందరు మండపాల నిర్వాహకులు విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో విగ్రహాలను తీసుకెళ్తున్నారు. పండుగ వేళ పూజ సామగ్రి కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో మండల కేంద్రంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. సోమవారం నుండి తొమ్మిది రోజులపాటు వినాయకుడు ఘనంగా పూజలు అందుకోనున్నాడు.