|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 05:58 PM
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. 'సేవ్ సికింద్రాబాద్' ర్యాలీ కోసం తరలి వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదని చెబుతూ, ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక బలగాలను మోహరించారు.సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు భారీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని, అయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కారణంతో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.