|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 01:08 PM
తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, తమను నియంత్రించే ప్రయత్నాలు మానుకోవాలని అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తైవాన్ను ఒక పావుగా వాడుకోవద్దని తీవ్ర స్వరంతో స్పష్టం చేసింది. ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య నిన్న జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ల మధ్య జరిగిన ఈ చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ మాట్లాడుతూ... "తైవాన్ మా భూభాగంలో అంతర్భాగం. స్వాతంత్ర్యానికి మద్దతు ఇస్తున్నామనే పేరుతో తైవాన్ను అడ్డుపెట్టుకుని చైనాను కట్టడి చేయాలని చూస్తే సహించబోం" అని అమెరికాను హెచ్చరించారు. కొన్ని దేశాలు దక్షిణ చైనా సముద్రంలో కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని, బయటి శక్తులు అశాంతిని సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే, ఒకరి ప్రయోజనాలను మరొకరు గౌరవించుకుంటూ సమానమైన, శాంతియుత సైనిక సంబంధాలకు తాము సిద్ధంగా ఉన్నామని డాంగ్ జున్ స్పష్టం చేశారు.