ప్రకటనలే గాని పింఛన్లు లేవు..!
చేవెళ్ల, మేజర్ న్యూస్ (ఆగస్టు 31) : 58 సంవత్సరాలు పైబడిన అర్హులైన వృద్ధులకు తక్షణమే వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెళ్లి అనంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం 58 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ, కొత్త పింఛన్ల మంజూరుపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను కోసం అర్హులైన వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎదురుచూస్తున్న దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.
ప్రస్తుతం చేయూత పథకం కింద వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గుర్తు చేశారు. అదే విధంగా 58 సంవత్సరాలు పైబడిన అర్హులైన వృద్ధుల నుంచి కూడా వెంటనే దరఖాస్తులు స్వీకరించి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దేవుని ఎర్రవల్లి కౌన్సిలర్ మీనాక్షి, సత్యనారాయణ, చేవెళ్ల మున్సిపల్ జనరల్ సెక్రటరీ పత్తి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పిసరి శ్రీకాంత్రెడ్డి, బీజేపీ నాయకులు గుడుపల్లి మధుసూదన్రెడ్డి, సామ కృష్ణారెడ్డి, శ్రీకాంత్, కరుణాకర్, కరికే రవి, గణేష్, పాగా వెంకటేష్, రాజు, చంద్రయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.