రక్షణ రంగ ఎగుమతుల్లో డీపీఎస్యూల సంచలనం
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUs) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి ప్రదర్శనను కనబరిచాయి. రక్షణ ఎగుమతుల్లో ఏకంగా 151.2 శాతం భారీ వృద్ధిని నమోదు చేసి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి దిశానిర్దేశం చేశాయి. ఈ నేపథ్యంలో 16 డీపీఎస్యూల వార్షిక పనితీరుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో హెచ్ఏఎల్ (HAL), బీఈఎల్ (BEL), బీడీఎల్ (BDL), ఎండీఎల్ (MDL), జీఆర్ఎస్ఈ (GRSE), బీఈఎంఎల్ (BEML), మిధాని (MIDHANI) సంస్థల సీఎండీలు రక్షణ మంత్రికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డివిడెండ్ చెక్కులను అందజేయనున్నారు.
డీపీఎస్యూల మొత్తం టర్నోవర్ రూ. 1.29 లక్షల కోట్లకు చేరి, 15.4% వృద్ధిని నమోదు చేసింది. రూ. 23,136 కోట్ల పన్ను అనంతర లాభాన్ని (PAT) ఆర్జించాయి. ఇది గతం కంటే 15.6% అధికం. విదేశీ మార్కెట్లకు ఎగుమతులు ఏకంగా 151.2 శాతం పెరిగాయి.
ఇదే వేదికపై స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునీకరణపై రూపొందించిన 'ఆత్మనిర్భర్ DPSU', విద్యార్థుల కోసం ఉద్దేశించిన 'DISHA' (దిశ) కార్యక్రమాలతో పాటు హెచ్ఏఎల్ ఆధునీకరణ రోడ్మ్యాప్కు సంబంధించిన నాలుగు కీలక ప్రచురణలను రక్షణ మంత్రి ఆవిష్కరించనున్నారు. దేశీయ రక్షణ తయారీని పెంచడం, ఎగుమతులను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ సమీక్ష కొనసాగనుంది.