గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా
మంచాల, మేజర్ న్యూస్ (ఆగస్టు 31:) మండలంలోని గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అర్హత మేరకు పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ద్వారా పేదలకు 14 రకాల సరుకులు సరఫరా చేయాలని, భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, పార్టీ మండల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.