పెళ్లి మండపంలో రచ్చ
భర్త, బంధువులపై భార్య కుటుంబ సభ్యుల దాడి!
రాజన్న సిరిసిల్ల: పవిత్రంగా సాగుతున్న వివాహ వేడుకలో ఒక్కసారిగా హింస చెలరేగింది. సొంత చెల్లెలి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న భర్తపై భార్య, ఆమె కుటుంబ సభ్యులు విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ శివాలయంలో కస్తూరి శ్రావణ్ కుమార్ తన సోదరి వివాహ వేడుకను నిర్వహిస్తున్నారు. శ్రావణ్ కుమార్కు గతంలో గోదావరిఖని ప్రాంతానికి చెందిన సౌమ్యతో వివాహమైంది. అయితే, కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు తలెత్తడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో సౌమ్య తన భర్త శ్రావణ్ కుమార్పై గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో విచారణలో ఉంది.
కాగా, ఆదివారం శివాలయంలో శ్రావణ్ కుమార్ సోదరి పెళ్లి జరుగుతుండగా, సౌమ్య తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకుంది. మాటమాట పెరిగి, పెళ్లి మండపంలోనే శ్రావణ్ కుమార్ సహా ఆయన బంధువులపై సౌమ్య, ఆమె కుటుంబీకులు తీవ్రస్థాయిలో దాడికి దిగారు. పవిత్రమైన పెళ్లి వేడుక కాస్తా గొడవతో రసాభాసగా మారింది.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శ్రావణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.