రూ.500 కోట్ల ఆయిల్ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం
హరీష్ రావు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆయిల్ఫెడ్కు చెందిన రూ.500 కోట్ల విలువైన విలువైన భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని, దానిని ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అప్పగిస్తున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై ఆయన రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్, ఆర్టీసీ బస్ భవన్ ఎదురుగా ఉన్న ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (ప్లాట్ నం.1)లో 3.5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం గజం రూ.2 లక్షలు (మొత్తం రూ.500 కోట్లు) ఉంటుందని హరీష్ రావు తెలిపారు. అయితే, పరిశ్రమల శాఖ ఈ భూమిని గజం కేవలం రూ.56 వేల చొప్పున మొత్తం రూ.87 కోట్లకే ప్రైవేటు పరం చేయడానికి నిర్ణయించడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కూడా సమాచారం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సొంత ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ఫెడ్ ఆ స్థలానికి రూ.87 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని పక్కనపెట్టి మరీ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టడం వెనుక ఉన్న అసలు మర్మమేంటని ప్రశ్నించారు.
వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆయిల్ఫెడ్ భూమిని ఆ సంస్థకే కేటాయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బిఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.