జమ్మూ కాశ్మీర్లో 10 బ్రాండ్ల నెయ్యి విక్రయాలపై నిషేధం
శ్రీనగర్: నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న 10 ప్రముఖ బ్రాండ్లకు చెందిన నెయ్యి బ్యాచ్ల అమ్మకం, నిల్వ, పంపిణీ మరియు ప్రదర్శనపై జమ్మూ కాశ్మీర్ ఆహార, ఔషధ పరిపాలన (FDA) విభాగం తక్షణ నిషేధం విధించింది.
లాబొరేటరీ పరీక్షల్లో సేకరించిన నెయ్యి నమూనాలు నాసిరకంగా, అసురక్షితంగా మరియు తప్పుడు బ్రాండింగ్తో ఉన్నట్లు తేలడంతో ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006’ ప్రకారం ఎఫ్డీఏ ఈ చర్యలు తీసుకుంది.
డైరీ మోహన్, అప్నా డైరీ మిల్క్, మిల్క్ బైట్, నందిని, షాహీ తాజ్, దావత్ ఫ్రెష్, నంద్ కృష్ణ, వందు, డైరీ మిల్క్, మోహన్ డైరీలకు చెందిన కొన్ని నిర్దిష్ట బ్యాచ్ నెయ్యి ఉత్పత్తులను నిషేధించారు.
ఘజియాబాద్లోని జాతీయ ఆహార ప్రయోగశాల, కాశ్మీర్లోని పరీక్షా కేంద్రాల్లో జరిపిన విశ్లేషణల్లో నెయ్యిలో కృత్రిమంగా కలిపిన కూరగాయల కొవ్వు (వెజిటబుల్ ఫ్యాట్), బీటా-సిటోస్టెరాల్, అసాధారణ కొవ్వు ఆమ్లాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనల ప్రకారం నెయ్యిని కేవలం పాలు లేదా పాల ఉత్పత్తుల నుండి మాత్రమే తయారు చేయాల్సి ఉండగా, ఇతర పదార్థాలు కలపడం చట్టరీత్యా నేరమని ఎఫ్డీఏ స్పష్టం చేసింది.
ప్రభావిత బ్యాచ్ల విక్రయాలను తక్షణమే నిలిపివేసి, మార్కెట్ నుండి ఉపసంహరించుకోవాలని హోల్సేలర్లు, రిటైలర్లు, పంపిణీదారులను అధికారులు ఆదేశించారు. తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను 48 గంటల్లోపు సంబంధిత అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కాగా, వినియోగదారులు నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు బ్రాండ్, బ్యాచ్ నంబర్, ప్యాకింగ్ తేదీలను నిశితంగా పరిశీలించాలని ఎఫ్డీఏ సూచించింది. నిషేధిత బ్యాచ్లు ఎక్కడైనా విక్రయిస్తుంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది.