“ఈ పదవి మహిళలు లభించిన గౌరవం”
బాధ్యతగా ప్రజాసేవ చేస్తా
## రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి
@ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్, సెప్టెంబర్ 7 : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గా, క్యాబినెట్ మంత్రి హోదాతో శ్రీమతి గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సోమవారం ప్రజా భవన్ కు విచ్చేసిన గద్వాల విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఫైల్ పై విజయలక్ష్మి సంతకం చేశారు. అనంతరం సీఎం ప్రజావాణి హాల్ ను పరిశీలించారు. సీఎం ప్రజావాణి అమలు జరుగుతున్న తీరును ఆమె విశ్లేశించారు.
ఈ సందర్భంగా గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కానీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ పదవికి ఇప్పటి వరకు ఒక మహిళకు అవకాశం లభించలేదని, తొలిసారిగా ఒక మహిళకు ఈ బాధ్యత అప్పగించడం చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.
“ఈ అవకాశం నాకు వ్యక్తిగతంగా వచ్చిన గౌరవంగా మాత్రమే చూడటం లేదు. రాష్ట్రంలోని మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు లభించిన గుర్తింపుగా, ప్రోత్సాహంగా భావిస్తున్నాను. పరిపాలనలోనూ నిర్ణయాలు తీసుకునే స్థాయిలోనూ మహిళలకు మరిన్ని అవకాశాలు రావాలనే బలమైన సందేశాన్ని ఈ నియామకం ఇస్తోంది” అని విజయలక్ష్మి తెలిపారు.
రాష్ట్రంలో మూడు కీలకమైన పదవుల్లో మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు అవకాశం కల్పించడం మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని విజయలక్ష్మి అన్నారు.
తనపై విశ్వాసం ఉంచి ఈ గురుతర బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కే.సి. వేణుగోపాల్, కుమారి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విజయలక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తెలంగాణ రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఈ పదవిని గౌరవంగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తాను” అని గద్వాల విజయలక్ష్మి వివరించారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే కేశవరావు, వి. హనుమంతరావు, మహ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, డాక్టర్ రోహిన్ రెడ్డి, మధు యాస్కి గౌడ్, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, పీ. అనిల్ కుమార్ యాదవ్, వివిధ కార్పొరేషన్స్ చైర్మన్స్ ఈరావత్రి అనిల్, మెట్టు సాయి కుమార్, నూతి శ్రీకాంత్ గౌడ్, ఫయీమ్ ఖురేషి, అజ్మాతుల్లా హుస్సేని, గుత్తా అమిత్ రెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అనితా రావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కే. విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.