ఏఐ మానవాళి మనుగడకే తీవ్రమైన ముప్పు
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధిపతి హెచ్చరిక
జెనీవా: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ అది మానవాళి మనుగడకే తీవ్రమైన ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ సోమవారం హెచ్చరించారు. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ఏఐ విస్తరణ వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించేందుకు గ్లోబల్ టెక్ కంపెనీలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వచ్చే నెలలో తన రెండవ పదవీకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. "అధునాతన ఏఐ మానవాళి నిలకడకే తీవ్రమైన ముప్పును కలిగించగలదన్న పరిశ్రమ వర్గాల ఆందోళనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చాలా ఆలస్యం కాకముందే ఏఐ భద్రత మరియు రక్షణకు సంబంధించి పటిష్టమైన హామీలు, నిబంధనలను ఏర్పాటు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి ప్రయత్నం జరగాలి" అని పిలుపునిచ్చారు.
ఏఐ సాంకేతికతపై కొద్దిమంది వ్యక్తులు లేదా బహుళజాతి కంపెనీల చేతిలోనే "అపరిమితమైన అధికారం" కేంద్రీకృతమై ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉపయోగిస్తున్న దేశాలు మరియు సరఫరా గొలుసుల్లో భాగమైన ప్రతి ఒక్కరూ దీని వినియోగంపై స్పష్టమైన పరిమితులను ('రెడ్ లైన్స్') విధించుకునేందుకు ఏకం కావాలని స్పష్టం చేశారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్తో సహా పలువురు ఏఐ నిపుణులు గతంలోనే ఈ సాంకేతికత వల్ల ఎదురయ్యే ముప్పుల గురించి చేసిన హెచ్చరికలను వోల్కర్ టర్క్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.