భారత్-అమెరికా అంతరిక్ష బంధం
సహకారం నుంచి సహ-సృష్టికి చేరిన భాగస్వామ్యం
రాయబారి సెర్గియో గోర్
బెంగళూరు: భారత్ - అమెరికాల మధ్య అంతరిక్ష రంగానికి సంబంధించిన భాగస్వామ్యం కేవలం సాధారణ సహకారానికే పరిమితం కాకుండా ‘సహ-సృష్టి’ (Co-creation) స్థాయికి రూపాంతరం చెందిందని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కొనియాడారు. బెంగళూరు స్పేస్ ఎక్స్పో 2026 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఇరు దేశాలు సంయుక్తంగా అంతరిక్ష పరికరాలను రూపకల్పన చేయడంతో పాటు స్టార్టప్లకు నిధులు సమకూరుస్తున్నాయని స్పష్టం చేశారు.
బెంగళూరు వేదికగా జరిగిన 9వ యూఎస్-ఇండియా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ద్వారా ఈ భాగస్వామ్య మార్పు స్పష్టమైందని సెర్గియో గోర్ తెలిపారు. నేటి 21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష రారంగం అత్యంత కీలకమైన చోదక శక్తిగా ఆవిర్భవించిందని ఆయన అన్నారు. కమ్యూనికేషన్స్ భద్రత, నావిగేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి మరియు అధునాతన తయారీ రంగానికి ఇది ఎంతో దోహదపడుతోందని వివరించారు.
ఈ పోటీ ప్రపంచంలో అమెరికా వద్ద ఉన్న అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ మూలధనం, వాణిజ్య వ్యవస్థలకు భారత్కు చెందిన అసాధారణ సైంటిఫిక్ ప్రతిభ, ఇంజనీరింగ్ నైపుణ్యం, వినూత్న స్టార్టప్ రంగం తోడై ఒక "డ్రీమ్ టీమ్" రూపొందిందని గోర్ వర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ట్రస్ట్’ (TRUST - వ్యూహాత్మక సాంకేతికత ద్వారా సంబంధాల మార్పు) కార్యక్రమంలో అంతరిక్ష రంగమే ప్రధాన కేంద్రబిందువుగా ఉందన్నారు.
భారత ఆవిష్కర్తలతో వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా 'ట్రస్ట్ ఫెలోషిప్' ప్రారంభించడంతో పాటు బెంగళూరులో యూఎస్ కమర్షియల్ సర్వీస్ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 240 బిలియన్ డాలర్లు దాటిందని, అంతరిక్షంతో పాటు ఫార్మా, సాంకేతికత, రక్షణ రంగాలలో భాగస్వామ్యం ఊహించని స్థాయిలో పురోగమిస్తోందని ఆయన పేర్కొన్నారు.
కాగా, భారత ప్రభుత్వం, ఇస్రో, ఇన్-స్పేస్, ఎన్ఎస్ఐఎల్ భాగస్వామ్యంతో "ప్రపంచ పురోగతి కోసం అంతరిక్ష వినియోగం" అనే ఇతివృత్తంతో ముప్పైకి పైగా దేశాలు పాల్గొంటున్న మూడు రోజుల స్పేస్ ఎక్స్పోకు బెంగళూరు ఆతిథ్యమిస్తోంది.