భారతదేశ స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో కొత్త అధ్యాయం
భూఉష్ణ శక్తి రంగానికి కేంద్రం ప్రోత్సాహం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: స్వచ్ఛమైన మరియు వైవిధ్యమైన ఇంధన లభ్యత వైపు వేగంగా అడుగులు వేస్తున్న భారతదేశం, తన అపారమైన భూఉష్ణ శక్తి (జియోథర్మల్ ఎనర్జీ) సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యావరణానికి హాని కలిగించని, తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువరించే ఈ ఇంధనాన్ని నిరంతర విద్యుత్ మరియు ఉష్ణ వనరుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సౌర, పవన విద్యుత్ శక్తి వలె కాకుండా భూఉష్ణ శక్తి అనేది భూమి లోతుల్లోని వేడి ఆధారంగా వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భూఉష్ణ వనరుల క్రమబద్ధమైన అన్వేషణ, అభివృద్ధి కోసం నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) ఆధ్వర్యంలో జాతీయ విధానాన్ని కూడా నోటిఫై చేశారు.
ఈ సరికొత్త ఇంధన విప్లవంలో భాగంలో ఇటీవల లడఖ్లోని పూగా లోయలో ONGC ఎనర్జీ సెంటర్ 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దేశంలోనే మొట్టమొదటి రెండు భూఉష్ణ బావులను విజయవంతంగా ప్రారంభించి చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. సుమారు 1,000 మీటర్ల లోతు ఉన్న ఈ బావులు భారతదేశపు ప్రథమ 1-మెగావాట్ ప్రదర్శనాత్మక భూఉష్ణ విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి తోడ్పడనున్నాయి.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) అంచనా ప్రకారం దేశంలో దాదాపు 10.6 గిగావాట్ల భూఉష్ణ విద్యుత్ సామర్థ్యం ఉంది. అందుకోసం దేశవ్యాప్తంగా 381 వేడి నీటి బుగ్గలను మ్యాప్ చేసి, హిమాలయ ప్రాంతం, అండమాన్ నికోబార్, గోదావరి, సోన్-నర్మదా-తాపి, వెస్ట్ కోస్ట్ సహా 10 ప్రావిన్సులలో 42 ప్రధాన ప్రాంతాలను విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైనవిగా గుర్తించారు.
సాంకేతిక ఆధారంగా ఉపరితలానికి తీసుకొచ్చే వేడి నీరు, ఆవిరి ద్వారా టర్బైన్లను నడిపి విద్యుత్ను తయారు చేస్తారు. అంతేకాకుండా ఉపయోగించిన నీటిని తిరిగి భూగర్భంలోకి పంపడం ద్వారా ఈ వనరు నిరంతరం లభ్యమవుతుంది. విద్యుత్ ఉత్పత్తితో పాటు వ్యవసాయం, ఆక్వాకల్చర్, గృహాలను వేడి చేయడం మరియు చల్లబరచడానికి కూడా ఈ ఉష్ణాన్ని నేరుగా వాడుకోవచ్చు.
మరోవైపు, అన్వేషణ వ్యయాన్ని తగ్గించేందుకు పనికిరాకుండా పోయిన చమురు, గ్యాస్ బావులను భూఉష్ణ ప్రాజెక్టులుగా మార్చే ప్రయోగాలను గుజరాత్లోని అంక్లేశ్వర్, గాంధీనగర్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతాలలో MNRE వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే భారత్ స్వచ్ఛ ఇంధన రంగానికి తిరుగుండదని నిపుణులు భావిస్తున్నారు.