చంద్రుడిపైకి చేరే క్రమంలో భారత్ ‘మా పక్కనే’ ఉండాలి
అమెరికా రాయబారి సెర్గియో గోర్
బెంగళూరు: నాసా తన ప్రతిష్టాత్మక ‘మూన్ బేస్’ కార్యక్రమంలో చేరాలని ఇస్రోను ఆహ్వానించిందని, తాము చంద్రుడిపైకి తిరిగి వెళ్లే క్రమంలో భారత్ తమ పక్కనే ఉండాలని కోరుకుంటున్నట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. బెంగళూరు స్పేస్ ఎక్స్పో 2026లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్టెమిస్ ఒప్పందాలపై భారత్ గర్వంగా సంతకం చేసిందని, రాబోయే రోజుల్లో రెండు దేశాలు కలిసి చంద్రుడిపై సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల అంతరిక్ష భాగస్వామ్య ప్రాముఖ్యతను గోర్ వివరించారు. నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం కేవలం శాస్త్ర ప్రయోగానికే పరిమితం కాదని, ప్రాణాలను కాపాడే సాధనమని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం వెనిజులా భూకంప సమయంలో దట్టమైన మేఘాలను ఛేదించి నిసార్ అందించిన రాడార్ డేటా అత్యవసర సహాయక బృందాలకు మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు.
గ్రూప్ కెప్టెన్ శుభంశుక్లా గతేడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లడం ఒక ప్రధాన మైలురాయి అని చెప్పారు. ఆక్సియమ్-4 మిషన్తో పాటు భవిష్యత్తులో డాకింగ్ ప్రమాణాలు, వ్యోమగాముల సంయుక్త శిక్షణపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. పిక్సెల్, గెలాక్సీ, దిగంతర, బెల్లాట్రిక్స్, స్కైరూట్, అగ్నికుల్ వంటి భారత అంతరిక్ష స్టార్టప్లకు అమెరికా మార్కెట్ మరియు పెట్టుబడిదారుల తలుపులు తెరిచే ఉన్నాయని పిలుపునిచ్చారు.
అంతరిక్ష ట్రాఫిక్ సమన్వయంతో పాటు నిరంకుశ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛాయుత, నియమ-ఆధారిత అంతరిక్ష పాలన కోసం వాషింగ్టన్, న్యూఢిల్లీ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాలు కలిస్తే అంతరిక్ష రంగంలో అద్భుతాలు సాధ్యమవుతాయని, ఆకాశమే హద్దుగా ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను కలిసి నిర్మిద్దామని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.