హోర్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకల రాకపోకలు
దాడుల నేపధ్యంలో మే తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి రవాణా
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర దాడులతో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య రవాణా తీవ్రంగా దెబ్బతింది. గత 10 రోజులుగా ఈ మార్గం గుండా రోజుకు సగటున కేవలం 10 సరుకు రవాణా ఓడలు మాత్రమే ప్రయాణించాయని, ఇది మే నెల తర్వాత అత్యంత కనిష్ట స్థాయి అని సోమవారం నాటి షిప్పింగ్ డేటా వెల్లడించింది. శనివారం కేవలం రెండు నౌకలు, ఆదివారం ఆరు నౌకలు మాత్రమే ఈ జలసంధిని దాటినట్లు విశ్లేషణ సంస్థ 'క్ప్లర్' (Kpler) తెలిపింది.
అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జరిపిన దాడులకు ప్రతిగా, శనివారం అమెరికా దళాలు మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై విరుచుకుపడ్డాయి. ప్రతీకారంగా అనధికారిక మార్గాల్లో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్లతో పాటు ఇతర ప్రాంతాల్లోని మరో మూడు అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జిసి ప్రకటించింది. దాడులకు గురైన ఇరాన్ ట్యాంకర్లను డౌనీ, స్టార్క్ I, కైలోగా మారిస్క్స్ (Marisx) సంస్థ గుర్తించింది.
వాణిజ్య నౌకలను కూడా ఆర్థిక ఒత్తిడికి సాధనాలుగా వాడుతుండటం వల్ల సముద్ర రవాణాలో తీవ్ర ముప్పు ఏర్పడిందని సముద్ర నిఘా సంస్థ మారిస్క్స్ ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 6 నుండి ఇప్పటివరకు హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో 27 క్షిపణి దాడులు జరిగినట్లు UKMTO తెలిపింది. క్ప్లర్ డేటా ప్రకారం బుధవారం నుంచి ఏ అతిపెద్ద ముడి చమురు రవాణా నౌక (VLCC) కూడా ఈ జలసంధి నుండి బయటకు వెళ్లకపోవడం అక్కడ నెలకొన్న తీవ్ర పరిస్థితులకు అద్దం పడుతోంది.