మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి UAE పర్యటన ప్రారంభం
రాష్ట్ర అభివృద్ధిలో పెట్టుబడిదారులు భాగస్వాములవుతారని విశ్వాసం వ్యక్తం
దుబాయ్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదివారం దుబాయ్ చేరుకోవడంతో ఆయన మూడు రోజుల ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటన ప్రారంభమైంది. దుబాయ్లో నిర్వహించే 'యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్' (AIM) కాంగ్రెస్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశమై, మధ్యప్రదేశ్ను అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించనున్నారు. వాణిజ్యాన్ని పెంపొందించడం, లాజిస్టిక్స్, మైనింగ్, వ్యవసాయం, ఆహార శుద్ధి, వస్త్ర పరిశ్రమ, కృత్రిమ మేధస్సు (AI) వంటి ప్రధాన రంగాలలో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంచేందుకు పరిపాలనా ప్రక్రియలను సరళీకృతం చేశామని, జాప్యాన్ని తగ్గించేందుకు 900కు పైగా కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పర్యటనలో భాగంగా ఆయన అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మద్ అల్ యమ్మహీని కలిసి, వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో జరగనున్న 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్'కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
అదేవిధంగా, మధ్యప్రదేశ్ 'ఒక జిల్లా - ఒక ఉత్పత్తి' (ODOP) కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను సీఎం ప్రారంభించారు. ఇందులో బెతుల్ బెల్ మెటల్ క్రాఫ్ట్, అశోక్నగర్ చందేరి చేనేత వస్త్రాలు, ఉజ్జయిని బాతిక్ డైయింగ్, ఖర్గోన్ మహేశ్వరి చీరలు, గ్వాలియర్ కార్పెట్ వంటి స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ కొనుగోలుదారులకు ప్రదర్శించారు. సాయంత్రం వేళ "టైకూన్స్ బై AIM కాంగ్రెస్" సమావేశంలో వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. సెప్టెంబర్ 7 నుండి 9 వరకు జరిగే ఈ సదస్సులో భాగంగా సోమవారం మధ్యప్రదేశ్ పెవిలియన్ను ప్రారంభించి, దుబాయ్, షార్జా వ్యాపార ప్రతినిధులతో మోహన్ యాదవ్ చర్చలు జరపనున్నారు.