రష్యా-ఉత్తర కొరియా బంధానికి ప్రతీకగా తొలి రోడ్డు వంతెన ప్రారంభం
ప్యాంగ్యాంగ్: రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా తుమెన్ నదిపై నిర్మించిన తొలి రోడ్డు వంతెన సోమవారం ప్రారంభమైంది. రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్, ఉత్తర కొరియా ప్రధాని పాక్ థే సాంగ్ వీడియో లింక్ ద్వారా ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడంలో ఒక కిలోమీటరు పొడవైన ఈ రెండు వరుసల వంతెన చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఇరు దేశాల ప్రధానులు వ్యాఖ్యానించారు.
2024లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు గతేడాది ఏప్రిల్లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఈ కొత్త రహదారి ద్వారా ప్రతిరోజూ సుమారు 300 వాహనాలు దాటగలవని, ఇది రష్యాలోని వ్లాడివోస్టాక్ నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వరకు విస్తరించిన రవాణా నెట్వర్క్కు అనుసంధానమవుతుందని రష్యా ప్రభుత్వం తెలిపింది. 1946లో ఉత్తర కొరియా మొదటి నాయకుడు కిమ్ ఇల్ సంగ్ ప్రాణాలను కాపాడిన రెడ్ ఆర్మీ సైనికుడు యాకోవ్ నోవిచెంకో జ్ఞాపకార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టారు. ప్రస్తుతం సరుకు రవాణా ట్రక్కులకు అనుమతినివ్వగా, ఈ ఏడాది చివరినాటికి ప్రయాణికుల రాకపోకలకు కూడా వంతెనను పూర్తిగా అందుబాటులోకి తేనున్నారు.