అబుదాబి, దుబాయ్లలో పర్యటించనున్న ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ
భారీ పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ రోడ్షో
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించి, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మూడు రోజుల అధికారిక పర్యటనకు మంగళవారం బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కథనం ప్రకారం, సీఎం మాఝీ అబుదాబి, దుబాయ్లలో పర్యటించి ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులు, అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, సార్వభౌమ పెట్టుబడి నిధుల (సావరిన్ వెల్త్ ఫండ్స్) అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
పర్యటన ప్రారంభంలో అబుదాబి వేదికగా ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) తో రౌండ్టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు రకాల సహకార ఒప్పందాలపై (ఎంఓసీలు) సంతకాలు చేయడంతో పాటు యూఏఈ పెట్టుబడుల శాఖ మంత్రి, ఇతర పారిశ్రామిక ప్రముఖులతో చర్చలు జరపనున్నారు. అనంతరం దుబాయ్కి చేరుకోనున్న ముఖ్యమంత్రి, సెప్టెంబర్ 11న అక్కడ జరగనున్న 'ఒడిశా ఇన్వెస్టర్స్ మీట్'లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస ఒడియా (ఎన్ఆర్ఓ) ప్రజలతో, స్థానిక పారిశ్రామిక దిగ్గజాలతో ప్రత్యక్షంగా మాట్లాడి ఒడిశాలోని పారిశ్రామిక అవకాశాలు, రవాణా వసతులు, ప్రభుత్వ విధానాలను వివరించనున్నారు.
ఈ పర్యటన ద్వారా యూఏఈ-ఒడిశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక అనుసంధానం మరింత బలోపేతమవుతుందని ఒడిశా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. మూడు రోజుల సుదీర్ఘ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం మోహన్ చరణ్ మాఝీ సెప్టెంబర్ 12న తిరిగి రానున్నారు.