వారణాసి అభివృద్ధికి బీపీసీఎల్ రూ. 69.21 కోట్లు
వారసత్వ మార్గాలు, పార్కుల సుందరీకరణ
వారణాసి: సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో పౌర మౌలిక సదుపాయాలు మరియు వారసత్వ ప్రదేశాల పరిరక్షణ కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ. 69.21 కోట్ల విలువైన రెండు అవగాహన ఒప్పందాలపై (ఎంఓయూ) సంతకాలు చేసింది. బీపీసీఎల్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది. వారణాసి మేయర్ అశోక్ కుమార్ తివారీ, డివిజనల్ కమిషనర్ ఎస్. రాజలింగం, బీపీసీఎల్ సీఎండీ సంజయ్ ఖన్నా సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి.
మొదటి ఒప్పందం ప్రకారం రూ. 48 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నగరంలోని 119 పబ్లిక్ పార్కులను పునరాభివృద్ధి చేయడంతో పాటు సారనాథ్, మైదాగిన్లలో ఆధునిక ఫుడ్ స్ట్రీట్ హబ్లను ఏర్పాటు చేయనున్నారు. రెండో ఒప్పందంలో భాగంగా వారణాసి డెవలప్మెంట్ అథారిటీ (వీడీఏ) తో కలిసి రూ. 21.21 కోట్లతో థాతేరి హెరిటేజ్ లేన్ నుండి కాల భైరవ ఆలయం వరకు, గోడోలియా నుండి మైదాగిన్ వరకు ఉన్న వారసత్వ మార్గాల ముఖభాగాలను సుందరీకరించనున్నారు. అలాగే మణికర్ణికేశ్వర ఆలయ మార్గాన్ని కూడా పునరుద్ధరించనున్నారు. రాబోయే 36 నెలల్లో పూర్తికానున్న ఈ ప్రాజెక్టులు స్థానిక పర్యాటకాన్ని, జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు.