సాంప్రదాయ నైపుణ్యాలతో గ్రామీణ పరిశ్రమల స్థాపన: కేవీఐసీ
న్యూఢిల్లీ: ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) అందిస్తున్న శిక్షణ, ఆర్థిక సహాయం, సాంకేతికత మరియు మార్కెట్ మద్దతుతో దేశంలో సాంప్రదాయ నైపుణ్యాలు గ్రామీణ పరిశ్రమలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాదీ వికాస్ యోజన (కేవీవై), గ్రామొద్యోగ్ వికాస్ యోజన (జీవీవై), మరియు ప్రధాని ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) ద్వారా కేవీఐసీ స్థానిక వనరులకు ఆధునిక రూపానిస్తూ కొత్త జీవనోపాధి అవకాశాలను కల్పిస్తోంది.
ఈ పథకాల ద్వారా పలువురు గ్రామీణ పారిశ్రామికవేత్తలు విజయం సాధిస్తున్నారు. తమిళనాడుకు చెందిన టి. అజిన్ 'తేనె మిషన్' ద్వారా శిక్షణ పొంది 'మార్తాండం హనీ ప్రొడక్ట్స్'ను స్థాపించడమే కాకుండా, ఎస్సీ/ఎస్టీ వర్గాల రైతులకు తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తున్నారు. అలాగే బి. సుందరాజ్ వెటివర్ (వట్టివేరు) ఆధారంగా అగర్బత్తులు, హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసే 'ప్యూర్ హెల్త్ హెర్బల్ అగర్బత్తి' యూనిట్ను, ఎం. మురుగేశన్ పీఎంఈజీపీ మద్దతుతో అరటి పీచు ద్వారా అలంకరణ ఉత్పత్తులను తయారు చేసే 'ఓం బనానా క్రాఫ్ట్' సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు.
రైతులు, నిరుద్యోగ యువత కోసం 2017లో ప్రారంభించిన 'తేనె మిషన్' ద్వారా కేవీఐసీ ఇప్పటివరకు 2.46 లక్షలకు పైగా తేనెటీగల పెట్టెలను పంపిణీ చేసింది. దీని ద్వారా 2025-26 సంవత్సరంలో సుమారు 5,500 మెట్రిక్ టన్నుల తేనె ఉత్పత్తి జరగడమే కాకుండా, పంటల్లో పరాగసంపర్కం పెరిగి వ్యవసాయ ఉత్పాదకత కూడా మెరుగుపడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా మరియు ఈశాన్య రాష్ట్రాలలో తేనెటీగల పెంపకం వేగంగా విస్తరిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కేవీఐసీ కీలక పాత్ర పోషిస్తోంది.