ట్రంప్ పట్టుదల వేళ గ్రీన్ల్యాండ్లో ఈయూ భారీ పెట్టుబడులు
ఉర్సులా వాన్ డెర్ లేయన్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలని పట్టుబడుతున్న వేళ, ఆ ప్రాంతంలో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్ ఆర్కిటిక్ భూభాగమైన గ్రీన్ల్యాండ్లో €200 మిలియన్ల ($232 మిలియన్లు) భారీ ఈయూ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలను యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సోమవారం వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రీన్ల్యాండ్, డెన్మార్క్ ప్రభుత్వాలకు మద్దతుగా ఆమె ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు.
డెన్మార్క్ రాజ్యంలో పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన గ్రీన్ల్యాండ్కు ఈయూ పూర్తి సంఘీభావం తెలుపుతుందని, ఇక్కడ కేటాయించే ఈయూ నిధులు ప్రధానంగా కీలక ఖనిజాలు, శాటిలైట్ కమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై దృష్టి సారిస్తాయని ఉర్సులా స్పష్టం చేశారు. కరుగుతున్న మంచు వల్ల కొత్త నౌకా మార్గాలు, ఖనిజ సంపద అందుబాటులోకి వస్తుండటంతో అమెరికా, రష్యా, చైనా, యూరప్ వంటి ప్రపంచ శక్తులకు ఆర్కిటిక్ భౌగోళిక ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. గ్రీన్లాండ్ భవిష్యత్తును అక్కడ ఉన్న ప్రజలే నిర్ణయించుకోవాలని, త్వరలోనే కొత్త ఈయూ ఆర్కిటిక్ వ్యూహాన్ని రూపొందిస్తామని ఆమె పేర్కొన్నారు.
గ్రీన్ల్యాండ్ను అమెరికా నియంత్రించాలన్న ట్రంప్ డిమాండ్లతో అమెరికా-యూరప్ సంబంధాలలో తీవ్ర సంక్షోభం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై నాటో పరిధిలో చర్చలు జరుగుతున్నప్పటికీ ఇంకా ఎటువంటి ముగింపునకు రాలేదు. ఈ నేపథ్యంలో గ్రీన్ల్యాండ్ అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్ నిధులను పెంచడమే కాకుండా, 2028-2034 కాలానికి ఈయూ నిధులను €530 మిలియన్లకు (రెట్టింపు కంటే ఎక్కువగా) పెంచాలని ఈయూ కమిషన్ ప్రతిపాదించింది.