మధ్యప్రదేశ్ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రచారం చేసిన సీఎం డాక్టర్ మోహన్ యాదవ్
న్యూఢిల్లీ: దుబాయ్లోని AIM కాంగ్రెస్లో జరిగిన "ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్: మధ్యప్రదేశ్" కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రసంగించారు. రాష్ట్రంలో పారదర్శక విధానాలు, సుపరిపాలన మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణంతో పాటు విస్తృత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ యొక్క భౌగోళికంగా కేంద్ర స్థానాన్ని ప్రస్తావిస్తూ, బలమైన రోడ్డు, రైలు నెట్వర్క్ మరియు ఆధునిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు ఎగుమతులు, పంపిణీకి రాష్ట్రానికి గొప్ప అనుకూలతను కల్పిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు రాష్ట్రానికి ప్రధాన బలాలుగా ఉన్నాయని, ముఖ్యంగా ఆహార శుద్ధి, వస్త్ర పరిశ్రమలలో భారీ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చందేరి, మహేశ్వరి వంటి సాంప్రదాయ ఉత్పత్తులు మధ్యప్రదేశ్ యొక్క గొప్ప వారసత్వానికి ప్రతీకలని, వాటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూఏఈ (UAE) విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జెయోది పాల్గొని మాట్లాడుతూ.. యూఏఈకి భారతదేశం కీలక భాగస్వామి అని నొక్కి చెప్పారు. 2030 నాటికి భారత్-యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేందుకు భారతీయ రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అంతకుముందు, దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగిన AIM కాంగ్రెస్-2026 ప్రదర్శన ప్రాంతంలో మధ్యప్రదేశ్ పెవిలియన్ను సీఎం మోహన్ యాదవ్ ప్రారంభించి, పారిశ్రామిక ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు.
దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం పలువురు అంతర్జాతీయ నాయకులు, ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాస్ అల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సాకర్ అల్ ఖాసిమీతో సమావేశమై మధ్యప్రదేశ్-యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. యూఏఈ మంత్రి అల్ జెయోదితో భేటీ అయి, 'గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2027'కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే, తాతార్స్తాన్ అధినేత (రైస్) రుస్తం మిన్నిఖానోవ్ను కలసి భారత్-రష్యాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య సహకారంపై చర్చించారు. ప్రపంచ బ్యాంక్ డిజిటల్, ఏఐ విభాగం ఉపాధ్యక్షుడు సాంగ్బు కిమ్తో సమావేశమై మధ్యప్రదేశ్లో ఏఐ, డిజిటల్ పాలన, సాంకేతిక ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించే అవకాశాలపై చర్చించారు.