ముడి చమురు మంటలతో పతనమైన సూచీలు
సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ప్రారంభం
ముంబై: అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలతో భారతీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 సూచీ 36.05 పాయింట్లు (0.15 శాతం) క్షీణించి 23,743.10 వద్ద ప్రారంభం కాగా, సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా (0.21 శాతం) పడిపోయి 75,970.28 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఐటీ, ఆటో రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో సూచీలు దాదాపు 1 శాతం వరకు నష్టపోగా, ఆయిల్ & గ్యాస్ 0.48 శాతం, ప్రైవేట్ బ్యాంక్ సూచీ 0.39 శాతం పడిపోయాయి. అయితే నిఫ్టీ మెటల్ మాత్రం 0.45 శాతం లాభపడింది. మార్కెట్ వరుసగా ఐదో వారం కూడా బలహీనపడటానికి పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఐటీ స్టాక్స్లో అమ్మకాలు, జోరుగా వస్తున్న ఐపీఓల వల్ల ద్రవ్యత తగ్గడం ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పషియన్ గల్ఫ్లో ఇరాన్ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలతో ముడి చమురు ధరలు మరింత భారం కావడంతో ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ముగిశాయి. ప్రస్తుత పరిస్థితులలో సాంకేతికంగా నిఫ్టీకి 23,860 వద్ద నిరోధం, 23,720 వద్ద తక్షణ మద్దతు లభిస్తోందని విశ్లేషకులు తెలిపారు. పెట్టుబడిదారులు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ల కంటే ప్రాథమికంగా బలంగా ఉన్న లార్జ్క్యాప్ స్టాక్స్ వైపు మొగ్గు చూపడం మంచిదని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.