శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్.. లండన్ ఉద్యోగాల పేరిట కోట్ల దోపిడీ కేసులో చర్యలు
సూర్య క్రైమ్ డెస్క్: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్, 'నందూస్ వరల్డ్' ఫేమ్ ఎ. రమా నందనను హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు, యూకే వీసా స్పాన్సర్షిప్లు ఇప్పిస్తామని నమ్మించి తెలుగు రాష్ట్రాల్లోని పలువురు యువతను మోసగించిన వ్యవహారంలో నందన, ఆమె భర్తపై గతంలోనే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయిన ఆమెపై పోలీసులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించారు.
సోషల్ మీడియాలో ట్రావెల్ వ్లాగ్స్, విదేశీ జీవనశైలి వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న నందన దంపతులు ఆ క్రేజ్ను అడ్డం పెట్టుకుని నిరుద్యోగులను సులభంగా బుట్టలో వేసుకున్నారు. లండన్లో తమకు ఉన్నత స్థాయి పరిచయాలు ఉన్నాయని, సులభంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయల చొప్పున కోట్ల రూపాయలు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత వీసాలు ఇప్పించకపోవడమే కాకుండా ముఖం చాటేయడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్తో పాటు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీరిపై చీటింగ్ తదితర తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
బాధితుల ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగడంతో నందన విదేశాలకు వెళ్లిపోయింది. దీంతో అన్ని విమానాశ్రయాల్లో అప్రమత్తంగా ఉండాలని లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం ఆమె దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకోగానే పాస్పోర్ట్ పరిశీలనలో అధికారులకు దొరికిపోయింది. ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని ఇబ్రహీంపట్నం మరియు విజయవాడ పోలీసులకు చేరవేశామని, అక్కడి నుంచి ప్రత్యేక పోలీసు బృందం రాగానే నందనను తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం వారికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.