ప్రపంచ వాణిజ్యంలో భారత్ దూకుడు
FTAలతో 75 శాతం గ్లోబల్ మార్కెట్పై దృష్టి
న్యూఢిల్లీ: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా ప్రపంచ మార్కెట్లలో భారత వస్తువులకు ప్రాధాన్యతను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కుదుర్చుకోబోయే కొత్త ఒప్పందాలతో అంతర్జాతీయ వాణిజ్యంలో దేశానికి భారీ ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. దాదాపు 60 ట్రిలియన్ డాలర్ల జీడీపీ పరిధి కలిగిన తొమ్మిది రకాల FTAలతో ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండు వంతుల భాగస్వామ్యానికి భారత్కు ప్రాధాన్యతా ప్రాప్యత లభిస్తోంది.
కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసూర్, SACU దేశాల కూటమి, GCC, మరియు ఇజ్రాయెల్లతో రాబోయే రెండు సంవత్సరాలలో కొత్త FTAలు కుదుర్చుకునేందుకు కసరత్తు వేగవంతమైంది.
ఆసియాన్, దక్షిణ కొరియా, జపాన్లతో ఉన్న ఒప్పందాల పునఃసమీక్ష ద్వారా మన పోటీదారుల కంటే మెరుగైన స్థానాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఈ ప్రాజెక్టులు, సమీక్షలు పూర్తయితే గ్లోబల్ మార్కెట్లో దాదాపు 75 శాతం భాగస్వామ్యంలో భారత్ అత్యల్ప సుంకాలతో పోటీపడే అవకాశం లభిస్తుంది.
గతంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతులు చేసే సమయంలో భారత్ అధిక సుంకాలు చెల్లించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని, ప్రపంచ దేశాలతో సమానంగా లేదా అంతకంటే తక్కువ సుంకాలతో మన వ్యాపారం సాగుతుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లలో మన ఉత్పత్తులకు అన్ని విధాలా అవకాశాలు దక్కాయని, ఇక మిగిలిందల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గ్లోబల్ ఎగుమతుల్లో సత్తా చాటడమేనని మంత్రి పిలుపునిచ్చారు.